ఎందుకు లేటైందంటే…? : మంత్రి వేముల

by  |
ఎందుకు లేటైందంటే…? : మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్ : ప్రాజెక్టులు లేని ప్రాంతం బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యాంలను నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనేది నా కల అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని అక్లూర్, మోతే గ్రామాల పరిధిలో కప్పలవాగుపై రూ. 14 కోట్ల 89 లక్షలతో నూతనంగా నిర్మించే మూడు చెక్ డ్యాంలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల సంవత్సరానికి మూడు చొప్పున ఇప్పటికే 9 చెక్ డ్యాంలను పూర్తి చేశామన్నారు. ఇక్కడి రైతుల శ్రేయస్సును, వారి కలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి ఇవ్వని విధంగా ఒకేసారి 10 చెక్ డ్యాంలను మంజూరు చేశారని, పనులు ఎప్పుడో ప్రారంభించుకోవాలని అనుకున్నాం కానీ, కరోనా వల్ల పనులు 3 నెలలు ఆలస్యం అయ్యాయి అన్నారు. కప్పల వాగు, పెద్దవాగు 45 కిలో మీటర్ల వరకు బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహిస్తాయని, వీటిపై వచ్చే సంవత్సరం మరో నాలుగు చెక్ డ్యాంలు మంజూరు చేయించుకుని మొత్తం 23 చెక్ డ్యాంలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ చెక్ డ్యాంలలో రెండు, మూడు కిలోమీటర్ల వరకు నీరు ఉంటుంది. ఒకచెక్ డ్యాం నీరు మరో చెక్ డ్యాంకు తాకుతుంది. ఈ చెక్ డ్యాంల వల్ల 33 గ్రామాలకు లబ్ధి జరగనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed