నాసిరకంగా చెక్ డ్యాం నిర్మాణం.. భవిష్యత్తులో ప్రమాదాలు..!

by  |
నాసిరకంగా చెక్ డ్యాం నిర్మాణం.. భవిష్యత్తులో ప్రమాదాలు..!
X

దిశ, మణుగూరు: ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి, సాగుకు ఉపయోగించేలా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్ డ్యాం నిర్మాణాలు చేపడుతోంది. నీటి అవసరాలు తీర్చేందుకు రూ. కోట్లు వెచ్చిస్తోంది. అయితే చెక్ డ్యాం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై పైపైన పనులు చేస్తూ బిల్లులు మాత్రం ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైకి బాగానే కనిపిస్తున్నా.. లోలోప మాత్రం పనుల్లో డొల్లతనం కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాసిరకం నిర్మాణాలు చేపడితే భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.

పినపాక నియోజవర్గంలో ఆరు చెక్ డ్యాంల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది. అయితే వీటి నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు మాత్రం పనుల్లో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్ డ్యాం నిర్మాణాలకు వాడే కంకర, సిమెంటు, ఇసుక, రాడ్లు తదితర వాటన్నింటినీ నాసిరకానివి వాడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పనులు..

నిర్మాణ పనుల్లో ఎంత నాణ్యత ఉంటే డ్యాం అంత పటిష్టంగా ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లు అవేం పట్టించుకోకుండానే పనులు తూతూమంత్రంగా కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. అడుగున గట్టి మట్టి వచ్చేవరకు తొవ్వకుండానే కేవలం పది ఫీట్ల మేర తవ్వి పనులు కానిచ్చేస్తున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు డ్యాం అడుగుభాగంలో సిమెంట్ బెడ్ వేయకుండానే పనులు కానిచ్చేస్తున్నారని.. పిల్లర్లలో ఐదు సలాకులు వాడాలని స్వయానా కలెక్టర్‌ చెప్పినా మూడు రకాలు మాత్రమే వాడుతున్నారు. ఇంత నాసిరకంగా చెక్‌డ్యాం నిర్మిస్తే నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లకు చెప్పేవారు లేకే ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

అధికారులతో కుమ్మక్కై..

చెక్ డ్యాం పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుత్తేదారులు, అధికారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేస్తూ ఎక్కువు బిల్లులు పెడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అయితే వీరికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తోడవడతో ఎవరు ప్రశ్నించేందుకు సాహసం చేయడం లేదని చెపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గ ప్రజలకోసం చెక్ డ్యాం లకు నిధులు మంజూరు చేయిస్తే.. నాసిరకం పనులు చేస్తూ ఎమ్మెల్యే పరువు తిస్తున్నారని వాపోతున్నారు. పనులను పది నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ అంతకంటే ముందే హడావిడిగా చేయడంలోని ఆంతర్యమేంటని పలువురు మాట్లాడుకుంటున్నారు.



Next Story

Most Viewed