30 మంది యువతులకు వల.. అమ్మాయికో నంబర్ మార్చుతూ..

by  |
Srinivas
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే నూరేళ్ల పంట. కాబోయే వరుడి కోసం యువతులు ఎన్నో కలలు కంటుంటారు. అదే వీక్ నెస్‌ను ఓ వ్యక్తి క్యాష్ చేసుకున్నాడు. పెళ్లి, ఉద్యోగం పేరుతో 30 మంది యువతులను నట్టేట ముంచాడు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.3 కోట్లను కొట్టేశాడు. ఇదీ చాలదన్నట్లు గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీగా డబ్బు సంపాదనే ధ్యేయంగా కన్నింగ్ ప్లాన్లు వేశాడు. ఇందులో భాగంగా మ్యాట్రిమోనీ సైట్లపై కన్నేశాడు. వాటిల్లో తన బట్ట తలకు విగ్గు పెట్టుకుని దిగిన ఫొటోలను పెట్టి అందగాడిగా పోజులు ఇచ్చాడు. తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌నని, ఏడాదికి రూ.20 లక్షల వేతనంగా ప్రొఫైల్‌ను క్రియోట్ చేశాడు. అదే సైట్లో ఉన్న చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.పేటకు చెందిన యువతి ఫోన్ నంబర్ తీసుకోని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అలా ఆమెతో రోజు మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని వల విసిరాడు. అతడి ప్రొఫైల్‌ను చూసిన యువతి నిజమేనని నమ్మింది.

అయితే శ్రీనివాస్ ఓ రోజు ఆ యువతికి ఫోన్ చేసి తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, అర్జెంట్‌గా రూ.1.40 లక్షలు కావాలని ఏడుస్తూ మాట్లాడాడు. మరో యువతి అకౌంట్ నంబర్ ఇచ్చి డబ్బులు ట్రాన్సఫర్ చేయాలని కోరాడు. వెంటనే ఆమె ఆ నగదును పంపించింది. ఆ తర్వాత ఆమెకు ముఖం చాటేశాడు. తాను మోసపోయానని గ్రహించిన యువతి చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విధంగా ఒంగోలుకు చెందిన ఐటీ ఉద్యోగిని నుంచి రూ.27 లక్షలు, నరసారావు పేట ఉద్యోగిని నుంచి రూ.40 లక్షలు, మదనపల్లెకు యువ వైద్యురాలి నుంచి రూ.7లక్షలు కాజేశాడు. ఇలా 30 మంది యువతుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేశాడు. అతడి వలలో చిక్కిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యువతులు ఉన్నారు. శ్రీనివాస్ ముందస్తు ప్లాన్‌గా యువతికో ఫోన్ నంబర్‌ను వాడటంతోపాటు తన బట్ట తలను కవర్ చేస్తూ విగ్గులను వాడి అందమైన యువకుడిగా చలామణి అయ్యాడు. కొందరికి పెళ్లి, మరికొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడు.

Arest

పోలీసులు చిత్తూరు శివారులోని మరకంబట్టు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన శ్రీనివాస్ అనుమానస్పదంగా వ్యవహరించాడు. వెంటనే అతడి వాహనాన్ని తనిఖీ చేయగా.. నాలుగు కిలోల గంజాయి లభ్యమయింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి విచారించగా.. అతడిపై అప్పటికే చీటింగ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఎంసీఏ చదివిన ఇతడు మొదట్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసినా.. చీటింగ్‌తోనే ఎక్కువ సంపాదన ఉన్నట్లు గుర్తించి ఆ జాబ్‌ను వదిలేశాడు. ఈ క్రమంలోనే యువతులను మోసం చూస్తూ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. బయటకు వచ్చినా బుద్ధి మార్చుకోకుండా మళ్లీ అదే పనులకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మరో వైపు గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై వివిధ కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed