‘కరోనా’ కిట్ల పేరుతో చీటింగ్!

by  |
‘కరోనా’ కిట్ల పేరుతో చీటింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : డబ్బు సంపాదించాలంటే ఉపాయం ఉంటే సరిపోతుంది. కాస్త తెలివి ఉంటే చాలు మార్కెటింగ్ చేయగలిగితే లాభాలే. ఓ కుటుంబం డబ్బు సంపాదించేందుకు కరోనానే తొలి పెట్టుబడిగా చూపించింది. కరోనా చికిత్సకు అవసరమయ్యే కిట్లు, మెడికల్ కేర్ ఎక్విప్​మెంట్​ను తైవాన్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారాన్ని చేస్తున్నట్లు ప్రచారం చేసింది.

నగరంలోని ఓ ప్రధాన కాలనీలో సొంతింటిని చిరునామాగా, మరో ప్రాంతంలో కంపెనీ అడ్రెస్ ను చూపారు. అత్యాశకు పోయిన జనాలు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టారు. నమ్మించడానికి ఆ కుటుంబం రెండు వారాల పాటు లాభాలు పెద్దగా వచ్చినట్టు ఖాతాలలో డబ్బులు జమ చేసింది. దానిని రుజువుగా చూపుతూ మరింత పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలొస్తాయని 50:50 అంటూ ప్రలోభపెట్టింది. ఈ క్రమంలోనే బారిగా డబ్బులు చేతిలో పడగానే ఆ కుటుంబం చల్లగా ముఖం చాటేసింది. మోసపోయినవారిలో నగరంతోపాటు పలు జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం.

స్టూడెంట్స్ తోనే దందా

సదరు కుటుంబం హెల్త్ కేర్ కంపెనీ పేరిట వెబ్ సైట్ ను సృష్టించింది. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రధాన కళాశాలలో చదువుతున్నారు. వారి కంపెనీ గురించి విద్యార్థుల్లో ప్రచారం చేశారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని నమ్మబలికారు. తోటి స్టూడెంట్ చెబుతుండడంతో తొలుత రూ.వేలల్లో పెట్టారు. వారం లోపలే పెద్ద ఎత్తున లాభాలొచ్చినట్లు ఖాతాల్లో జమ చేశారు. దాంతో విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర రూ.లక్షల్లో తీసుకొచ్చి జమ చేశారు. రూ.లక్షకు వారంలోనే రూ.18 వేలు వస్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిచింది. కొంత కాలం క్రితం డబ్బులేవీ రిటర్న్ రాకపోవడంతో అసలు విషయం బయట పడింది. మోసపోయినట్లుగా గుర్తించారు. పెట్టుబడి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ కుటుంబ సభ్యులు, వారి స్నేహితుల ద్వారా ఏకంగా రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. వాళ్లకు ఎప్పుడెప్పుడు ఎలా డబ్బులు చెల్లించారన్న ఆధారాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి కూడా ఈ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. పెళ్లి కోసం దాచి పెట్టిన సొమ్మును తల్లిదండ్రులను ఒప్పించి డిపాజిట్ చేసినట్లు సమాచారం.

డిజిటల్ మనీ..

నగర శివారు ప్రాంతంలో కరోనా, లాక్ డౌన్ కాలంలోనే మరో స్కాం కూడా చోటు చేసుకుంది. రూ.1000 చెల్లిస్తే 90 రోజుల్లో రెట్టింపు ఇస్తాం. కేవలం ఆధార్ కార్డు నంబరు, పాన్ కార్డు నంబరుతో సభ్యత్వం తీసుకుంటే వాళ్లకో గుర్తింపు ఖాతా నంబరు ఇస్తారు. పెట్టుబడి పెట్టిన మరుసటి రోజు నుంచే ఖాతాలో జమ చేస్తారు. క్లయింట్లను చేర్పిస్తే మరింత డబ్బు ముట్టజెప్పుతామనే ఆశలు కూడా రేపేవారు. మొదట్లో లావాదేవీలు సాఫీగా సాగిస్తున్నట్టు నటించిన తర్వాత భారీ మొత్తంలో జనాలు చేరడంతో వెబ్ సైట్ బ్లాక్ అయ్యింది. పెట్టుబడి పెట్టిన చాలా మందికి పైసా రాలేదు. కాగా, చాలామంది రూ.1000 నుంచి రూ.20 వేల వరకు జమ చేయడంతో ఆ కొద్దిపాటి డబ్బులకు పోలీసుల వరకు వెళ్లడం ఎందుకని మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ సభ్యుల సంఖ్య మాత్రం చాలా పెద్దదని తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కడ్తాల, ఆమన్ గల్, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో బాధితుల సంఖ్య పెద్దగానే ఉన్నది.


Next Story