అన్నార్థులకు అండగా ‘అవతార్ ట్రస్ట్’

by  |
అన్నార్థులకు అండగా ‘అవతార్ ట్రస్ట్’
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. పనుల్లేక తిండికి తిప్పలు పడుతున్న నిరుపేదలకు అవతార్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ఆపద సమయంలో రోజువారీ కూలీలు, నిరుపేదలకు నేనున్నానంటూ అభయమిస్తోంది. మార్చి 30వ తేదీ నుంచి నేటి వరకు ప్రతిరోజూ పేదలకు భోజనాలు అందించడం, నిత్యావసరాలు సమకూర్చడం, వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తూ.. ప్రజల, అధికారుల ఆదరాభిమానాలను పొందుతోంది. అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వీబీజే గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి రోజూ 3500 మందికి భోజనాలు అందించి పేదల ఆకలి తీర్చింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఆయా బస్తీల్లోని పేదలకు నిత్యావసరాలను అందజేస్తోంది.

సనత్ నగర్, బంజారాహిల్స్, భోలక్ పూర్, సికింద్రాబాద్, పద్మరావు నగర్, లాలాపేట, జూబ్లీహిల్స్, బోరబండ, పంజాగుట్ట, అమీర్ పేట తదితర ఏరియాలతో పాటు గద్వాల్, మెదక్ ప్రాంతాల్లోని అవసరమైన పేదలకు 5 కేజీల బియ్యం, పప్పు, ఉప్పు, కారం, చింతపండు, పసుపు తదితర 11 రకాలతో కూడిన 7 వేల ప్యాకింగ్ మెటీరియల్స్‌ను పంపిణీ చేశారు. అంతేకాదు, పలు ప్రాంతాల్లోని సుమారు 167 మంది జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం, రూ.1000 లను అందించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Corona, Lockdown, Avatar Charitable trust, VBJ group, GHMC, Daily needs

Next Story