‘డ్రగ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్‌ను మార్చండి’

by  |
‘డ్రగ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్‌ను మార్చండి’
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన నవీన్ కుమార్‌ను మార్చాలంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలంగాణ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. మొత్తం 23 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉమ్మడిగా ఈ మేరకు సంతకాలతో కూడిన లిఖితపూర్వక విజ్ఞప్తిని శాంతికుమారికి సమర్పించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సంబంధించిన సంయుక్త డైరెక్టర్ పోస్టు కాబట్టి ఆ రంగంలో అనుభవం ఉన్నవారినే నియమించాలని కోరారు. ప్రస్తుతం జేడీగా ఉన్న నవీన్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాల్లో ఎలాంటి అనుభవం లేదని, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా లేబొరేటరీలో కేవలం ఆరేళ్ళ అనుభవం మాత్రమే ఉన్నదని వివరించారు. ఆయన నియామకాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో చాలా మంది సీనియర్ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారని, ఎలాంటి అనుభవం లేకపోయినా నవీన్ కుమార్‌ను నియమించడం శాఖాపరమైన నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, తగినంత అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారని వివరించారు. లేబొరేటరీ, ఎన్‌పోర్స్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల సీనియారిటీని పోల్చకూడదని, రెండూ వేర్వేరు విభాగాలని ఆ లేఖలో వివరించారు. రాష్ట్ర (ఉమ్మడి) ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో నెం. 339, 28.8.1996) ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్నవారినే పదోన్నతిపై జేడీగా నియమించాల్సి ఉందని, కానీ దానికి విరుద్ధంగా డైరెక్టర్ ప్రీతి మీనా ఈ నెల 23న నవీన్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. గతంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఉదయ్ భాస్కర్‌ను జేడీగా నియమించిన సందర్భం ఉందని, ఇప్పుడు కూడా ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం నుంచే పదోన్నతి ద్వారా జేడీని నియమించాలని కోరారు.

Next Story

Most Viewed