విద్యుత్ బిల్లుల చెల్లింపు సమయాల్లో మార్పు

by  |
విద్యుత్ బిల్లుల చెల్లింపు సమయాల్లో మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ వల్ల విద్యుత్ వినియోగదారులు బిల్లులు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్) బిల్లు చెల్లింపు కేంద్రాల సమయాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయని పేర్కొంది. సంబంధిత అధికారులంతా ఈ సమయానికి తగినట్లుగా కార్యాలయాలు తెరువాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.

వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని పేర్కొంది. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ సడలింపు సమయంలో చాదర్‌ఘాట్ విద్యుత్ కార్యాలయం బిల్లింగ్ సెక్షన్ తెరువకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లాగే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు బిల్లింగ్ కౌంటర్ తెరిస్తే ఎలా చెల్లించేదంటూ ప్రశ్నించారు. తమకు ఆన్ లైన్ లో చెల్లించడం తెలియదని, నెలవారీ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమైతే జరిమానాలు విధిస్తన్నారని వారు వాపోయారు. అయితే టీఎస్ ఎస్పీడీసీఎల్ తాజా నిర్ణయంతో విద్యుత్ వినియోగదారులకు కొంత ఇబ్బంది తప్పే అవకాశముంది.



Next Story

Most Viewed