ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు

by  |
ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు
X

దిశ, ఏపీ బ్యూరో: ‘బడిలో ఉండాల్సిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బజారున పడేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సహకారాన్ని రద్దు చేయడం పేద విద్యార్థులకు అందించే విద్యకు గొడ్డలిపెట్టుగా మారింది. విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకోవడం మంచిదికాదు. దశాబ్దాలుగా పేద విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో విద్యను అందించే ఎయిడెడ్ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేయడం సబబు కాదు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో.42ను రద్దు చేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యా సంస్థలు, విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు.? కొవిడ్ కారణంగా రెండు నెలలు ఆలస్యంగా విద్యాసంవత్సరం ప్రారంభమై ఆందోళన చెందుతుంటే.. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం విద్యార్థులను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మధ్యలో ఉండగా.. ప్రభుత్వం విలీనం నిర్ణయం చేయడం విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేయడమేనని’ చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వ సాయాన్ని నిలిపేయడం వల్ల ఆ భారం పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఫీజులు కట్టలేక అర్థాంతరంగా చదువులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను, సిబ్బంది జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదు. ఒకటిన్నర శతాబ్దకాలంగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నీరుగార్చుతున్నారు.? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగించాలి.

అమ్మఒడి ఎవరు అడిగారు.. మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన పెద్దఎత్తున పోరాటం తప్పదు’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Next Story

Most Viewed