రాష్ట్రపతికి చంద్రబాబు కీలక ప్రతిపాదన.. ఏపీలో అలా చేయండి

by  |
రాష్ట్రపతికి చంద్రబాబు కీలక ప్రతిపాదన.. ఏపీలో అలా చేయండి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని..రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు వినతిపత్రం అందజేసినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి చంద్రబాబు టీం నివేదిక అందజేసింది. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ, ఆర్ధిక దివాళా, ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రేరేపిత ఉగ్రవాదం

టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి వివరించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానికి చిరునామా ఏపీనేనని చంద్రబాబు ఆరోపించారు. ఏజెన్సీలో 25 వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని.. దీని విలువ రూ.8 వేల కోట్లు ఉంటుందని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధమని చెప్పి ధరలు పెంచుతూ సొంత వ్యాపారం చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవు.. అడిగే స్వేచ్ఛ లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటిని రాష్ట్రపతి కోవింద్ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని అందుకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడులే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నానిలు ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed