రాష్ట్రంలో అక్రమంగా బాక్సైట్‌ను తవ్వేస్తున్నారు : చంద్రబాబు

by  |
రాష్ట్రంలో అక్రమంగా బాక్సైట్‌ను తవ్వేస్తున్నారు : చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ మన్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయన బంధువులు బాక్సైట్‌ను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు బాక్సైట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూనే అన్యాయంగా.. అక్రమంగా బాక్సైట్‌ను తవ్వేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిపైనే ఫోకస్ పెట్టిందని రైతులు, బడుగులు,బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. పంట రుణాలు, ఎరువులు, పంట బకాయిలు అందక అన్నదాత ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వజమెత్తారు.

కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వారిని ఆదుకోవాల్సింది పోయి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. దశలవారీగా మద్యపాన నిషేధమంటూ మహిళలను నమ్మించి మోసం చేశారంటూ మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేయకపోగా.. మద్యం ధరలు పెంచి పేదల ఇళ్లు గుళ్ల చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా కాసులకు కక్కుర్తిపడి నాసిరకం మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యంలో ఇప్పటికే రూ.25వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రెండేళ్ల జగన్‌ పాలనలో ఒక్కరోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజల సంక్షేమం కోసం కాదని.. వైసీపీ లూఠీ కోసమేనని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

Next Story