మహానాడులో చంద్రబాబు ఏమన్నారంటే…!

by  |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రీజియన్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం వేదికగా బుధవారం తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతలు పాలుపంచుకోనున్నారు. జూమ్ యాప్ ద్వారా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచామని అన్నారు. భుజాలు అరిగిపోయేలా కార్యకర్తలు టీడీపీ జెండాలు మోశారని చెప్పారు. గతంలో టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఎంతో మంది కార్యకర్తల కుటుంబ సభ్యులు హత్యకు గురైనా పార్టీని వదలలేదన్న ఆయన, కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివన్నారు. ఈ ఏడాది కాలంలో వైఎస్సార్సీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారని విమర్శించారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారని అన్నారు. బెదిరించి, ఆర్థికంగా కుంగదీసినా వారు పార్టీని వీడలేదని, అలాంటి కార్యకర్తలందరికీ పాదాభివందనం అని చంద్రబాబు తెలిపారు.

కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కరోనాపై జగన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారని ఆయన మండిపడ్డారు. చివరకు బ్లీచింగ్ పౌడర్‌లో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని దారుణమైన మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని బాబు విమర్శించారు.

70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును ఆపేశారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి, కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చేందుకు తాము చేపట్టిన పనులు కూడా ఆపేశారని అన్నారు. కృష్ణా-గోదావరి-పెన్నా ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశారని తెలిపారు. అమరావతిని కొనసాగించి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. వైసీపీ పాలన మొత్తం అవినీతి, భూకబ్జాలమయమేనని ఆయన ఆరోపించారు.

ఆరోగ్యసేతు యాప్ తయారు చేసిన విశాఖ వ్యక్తి భూమిని కాజేయాలని పులివెందులకు చెందిన కొందరు చూశారని ఆయన ఆరోపించారు. ఆయన భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ దౌర్జన్యం చేశారని అన్నారు. ఆవ, రాజమండ్రి భూములు కబ్జా చేస్తున్నారని, గుడివాడలో 63 మందికి చెందిన భూములను ఇచ్చేయాలంటూ ఒక మంత్రి బలవంతం చేస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షోభ సమయంలో కూడా టీటీడీ భూములు అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని చంద్రబాబు విమర్శించారు. సింహాచలంలో భూములు కబ్జా చేశారని, విజయవాడ కనకదుర్గ గుడిలో అవినీతి జరిగిందని, బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

Next Story

Most Viewed