మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం : తెలంగాణ మంత్రులు

by  |
మహిళా లోకానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం : తెలంగాణ మంత్రులు
X

దిశ, కంటోన్మెంట్ : పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకొని సిక్ విలేజ్‌లోని మడ్ పోర్డ్ ధోభీ ఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మంత్రులు తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సాయన్నలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ అనేక భూ పోరాటాలు చేసినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అని ఆమె సేవలను కొనియాడారు.

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ధీర వనిత అని అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని తెలిపారు.

రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో 3 ఎకరాల విస్తీర్ణంలో 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఐలమ్మ స్మారక భవనం ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. 5వ తరగతిలో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోయిన్ పల్లి మార్కెట్ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సంఘం నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed