చెడ్డీ గ్యాంగ్ ముఠాకు రెండేళ్ల జైలు శిక్ష

by  |
చెడ్డీ గ్యాంగ్ ముఠాకు రెండేళ్ల జైలు శిక్ష
X

దిశ, క్రైమ్ బ్యూరో : విభిన్నమైన రీతిలో నేరాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్ సభ్యులకు రెండేళ్ల జైలు శిక్షను వేస్తూ ఎల్‌బీ నగర్ సెకండ్ ఎంఎం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. దొంగతనాలు చేసే సమయంలో పోలీసులు, ప్రజల నుంచి సులభంగా తప్పించుకోడానికి చెడ్డీ, బనియన్లు మాత్రమే ధరించి ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో 2011 నుంచి పలు ఇండ్లల్లో దొంగతనాలు చేసింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ నలుగురిలో రామ్ బాదియా, కిషన్ బాదియా, రావోజీ బాదియాలు సొంత అన్నదమ్ములు కాగా, మరొకరు ఖాజు మావోజీ.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో ఐదుగురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు 2018 ఆగస్టు 1వ తేదీన అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వీరి నుంచి 400 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, రూ.3.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగంతో చర్లపల్లి జైలులో ఉంచారు. అయితే, అనారోగ్య కారణాల రీత్యా ఐదో నిందితుడు గనావా భారత సింగ్ జైలులోనే మరణించారు. ఈ కేసులో రెండు ఇండ్ల దొంగతనాలలో మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను విధించారు. దీంతో ప్రస్తుతం వారు చర్లపల్లి జైలులో ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఘట్కేసర్ పీఎస్ పరిధిలో 2017లో నమోదయిన మరో కేసులో ఎల్‌‌‌బీ నగర్ సెకండ్ ఎంఎం మెజిస్ట్రేట్ కవితాదేవి ఈ నలుగురికి రెండేళ్ళ జైలు శిక్ష, ఒక్కొక్కరి రూ.10 వేల జరిమానాను విధించారు.

Next Story