టీకా పూర్తయిన కాలనీలకు సర్టిఫికేట్లు

by  |
టీకా పూర్తయిన కాలనీలకు సర్టిఫికేట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న కాలనీలకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక సర్టిఫికెట్లను ఇవ్వనుంది. అంతేగాక ఆ ప్రాంతం పరిధిలోని ప్రతి ఇంటికి పుల్లీ వ్యాక్సినేటెడ్ అని డోర్లపై స్టిక్కర్లు అంటివ్వనున్నారు. దీంతో పాటు ఆ చుట్టు పక్కల పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ అని బ్యానర్లు కట్టనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ గురువారం టార్గెట్ 100 పర్సెంట్ వ్యాక్సినేషన్ ప్రణాళికను విడుదల చేసింది. సోమవారం నుంచి ఇంటింటికి తిరిగి ఇప్పటి వరకు టీకా పొందని 18 ఏళ్ల పై బడిన వారందరికీ డోసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4846 కాలనీల్లో సెప్టెంబరు 9వ తేది వరకు 100 శాతం ప్రజలకు టీకా అందివ్వాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను 150కి పెంచనున్నట్లు స్పష్టం చేసింది. అన్ని కాలనీలు, సోసైటీలు, అపార్ట్ మెంట్లలో టీకా తీసుకోని వారిని గుర్తించి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థలు, మీడియా ను కూడా భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించింది. వీటి పర్యవేక్షణకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అనురాధను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వైద్యశాఖ ప్రకటించింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 50 కేంద్రాల ద్వారా ప్రతీ రోజు సుమారు 15 వేల మందికి, 90 మొబైల్ సెంటర్ల ద్వారా 20 వేల మందికి టీకాలు పంపిణీ చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో వీటి సంఖ్యను పెంచుతూ వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయనున్నట్లు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.

5,30,383 మంది ఒక్క డోసు కూడా తీసుకోలే..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలో 90,35,088 మంది జనాలు ఉండగా, వీరిలో 55,75,388 మంది 18 ఏళ్లు పై బడిన వారున్నారు. వీరిలో 50,45,005 మంది ఫస్ట్ డోసును పూర్తి చేసుకోగా, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు కేవలం 15,27,423 మంది మాత్రమే. అంటే 5,30,383 మంది ఇప్పటి వరకు అసలు డోసు తీసుకోలేదు. వీరందరికీ సోమవారం నుంచి స్పెషల్ వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతుంది.


Next Story

Most Viewed