యువతకు ఐటీఐలు మార్గదర్శనమౌతాయి

by  |
యువతకు ఐటీఐలు మార్గదర్శనమౌతాయి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
రాబోయే రోజుల్లో యువత తలెత్తుకుని గౌరవంగా జీవించేందుకు మోడల్ ఐటీఐలు మార్గదర్శనం అవుతాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు. ఇజ్రాయిల్, జపాన్ తదితర దేశాల మాదిరిగా భారత్ లో కూడా విద్యా విధానాన్ని మార్చడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. మల్లేపల్లిలో రూ 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలో 14,744 ఐటీఐ కళాశాలలు ఉండగా సుమారు 24 లక్షల మంది శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనా కారణంగా సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇందులో పూర్తి మార్పు తేవడానికే విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ… ఐటీఐలో ప్రస్తుతం 22 ట్రేడ్లు ఉండగా మరో 6 ట్రేడ్లను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… మల్టీనేషన్ కంపెనీల సహకారంతో ఐటీఐ లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Next Story

Most Viewed