త్వరలో నాలుగు జిల్లాలకు కేంద్ర వైద్య బృందాలు

by  |
త్వరలో నాలుగు జిల్లాలకు కేంద్ర వైద్య బృందాలు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల్లో ప్రావీణ్యం కలిగిన నిపుణులు బృందాలు అధ్యయనం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 50 జిల్లాలు, మున్సిపల్ నగరాలను విశ్లేషించిన కేంద్ర వైద్యారోగ్య శాఖ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ అమలవుతున్న చర్యలను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందించే విధంగా పదిహేను రాష్ట్రాలకు బృందాలను పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ముగ్గురు సభ్యులతో కూడిన వేర్వేరు బృందాలను పంపుతోంది. ఈ బృందాల్లో అంటువ్యాధుల నిపుణులు, ప్రజారోగ్యంలో అనుభవం కలిగినవారు, వైద్య వృత్తిలో విశేష కృషి చేసినవారు, మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి హోదా కలిగిన అధికారి తదితరులు ఉంటారు. కరోనాను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలు తదితరాలపై ఈ బృందాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజారోగ్య వ్యవస్థ తరఫున అమలవుతున్న వివిధ రకాల పనులను పరిశీలిస్తారు. ఇంకా అదనంగా తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సూచిస్తారు.

ఈ బృందాలు ఎప్పటి నుంచి రాష్ట్రంలో పర్యటిస్తాయి, ఎంతకాలం ఉంటాయి తదితరాలన్నింటిపై కేంధ్ర వైద్యారోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ తదితర పలు అంశాల్లో అమలవుతున్న విధానాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. తక్కువ టెస్టులు చేయడంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. రాష్ట్ర హైకోర్టు సైతం తక్కువ సంఖ్యలో టెస్టులు చేయడంపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త కేసులు ఏయే కారణాలతో నమోదవుతున్నాయి, స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం ఏ స్థాయిలో ఉంది, ఇతర వ్యాధులతో ఉన్న కారణంగా మృతి చెందడానికి ఉన్న ఆస్కారం, కరోనా మృతుల్లో ఇతర జబ్బుల తీవ్రత ఎలా ఉంది, ప్రతీ పది లక్షల మందికి ప్రభుత్వం ఎన్ని టెస్టులు చేస్తోంది, పాజిటివిటీ రేటు ఏ స్థాయిలో ఉంది, కరోనా లక్షణాలు ఎంత మందిలో ఉంటున్నాయి, ఆసుపత్రుల్లో చికిత్స ఎలా జరుగుతోంది, పీపీఈ కిట్లు, మాస్కుల లభ్యత ఎలా ఉంది, మందులు తగినంత నిల్వ ఉన్నాయా, డబ్లింగ్ రేటు ఏ స్థాయిలో ఉంది, బెడ్‌ల కొరత, వైద్య సిబ్బంది కొరత, ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది… ఇలా అనేక అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. ఇప్పటికే కామారెడ్డి, జనగాం, నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీరో సర్వియలెన్స్ బృందాలు పర్యటించి వెళ్లి కేంద్ర వైద్యారోగ్య శాఖకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కేంద్ర బృందాలు వస్తుండడం గమనార్హం.



Next Story

Most Viewed