హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం

by  |
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
X

దిశ, న్యూస్ బ్యూరో: వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ ఉన్న నగరాల్లో పర్యటిస్తున్న కేంద్ర వైద్య బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర సందర్శించి బృందం సోమవారం తెలంగాణలో కరోనా పరిస్థితిపై సమీక్షించనుంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ బృందం హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కారణాలు, కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఆసుపత్రుల్లో లభిస్తున్న వైద్య సేవలు, కరోనా టెస్టుల సంఖ్య, పాజిటివిటీ రేటు.. ఇలా అనేక అంశాలను అధ్యయనం చేస్తుంది.

నగరంలోని కొన్ని కంటైన్‌మెంట్ జోన్లలో క్షేత్రస్థాయి పర్యటించి, అక్కడ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలిస్తుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంది. ఆ తర్వాత కరోనా కోసం ఉన్న ఏకైక గాంధీ ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లకు అందుతున్న సేవలు, రికవరీ అవుతున్న తీరు, డాక్టర్ల కొరత, నర్సుల సంఖ్య, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న బెడ్‌లు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు.. ఇలా అనేక అంశాలను పరిశీలిస్తుంది. కేసుల సంఖ్య పెరిగి ఆసుపత్రిలో అడ్మిషన్లు పెరిగినట్లయితే అదనంగా సిద్ధంగా ఉన్న ఆసుపత్రులు, వాటిల్లోని బెడ్‌లు.. లాంటి విషయాలపై కూడా అధికారులతో చర్చిస్తుంది. కరోనా పేషెంట్ల కోసం సిద్ధం చేసిన గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని కూడా ఈ బృందం సందర్శించనుంది.

నగరంలో పర్యటించే సందర్భంగా దుకాణాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలన్న నిర్ణయాన్ని ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించాలనుకుంటున్న అంశానికి సంబంధించి కూడా అటు ప్రజలను, ఇటు అధికారులను ఈ బృందం అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రమే ఈ బృందం తిరిగి ఢిల్లీకి వెళ్తుంది. వారి క్షేత్రస్థాయి పర్యటనలో వెలుగులోకి వచ్చిన అంశాలపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. దానికి అనుగుణంగా కేంద్రం తదుపరి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed