సినిమా షూటింగ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by  |
సినిమా షూటింగ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో పాటు సినిమా షూటింగ్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. కాగా, సినిమా షూటింగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ‘అన్‌లాక్-3’ ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సినిమా, టీవీ షూటింగులకు అనుమతులు జారీ చేస్తూ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులు తప్పనిసరిగా ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని.. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్ట్యూమ్స్‌, లోకల్ మైక్‌లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని, కెమెరా ముందు నటించేవాళ్లు.. నటించే సమయంలో మినహా మిగతా అందరూ మాస్క్ ధరించాలని సూచించింది. తక్కువ సిబ్బందితోనే షూటింగ్ జరిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు, షీల్డులను తప్పనిసరి చేసింది. ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేయడంతో పాటు సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలని సూచించింది. మేకప్ మెటీరియల్‌ను ఇతరులతో పంచుకోకుండా నియంత్రించాలని వెల్లడించింది.

ఇక సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, థియేటర్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. కొవిడ్-19 జాగ్రత్తలు తెలిపే పోస్టర్లను అతికించడంతో పాటు థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వీటితో పాటు టికెట్ల విషయంలోనూ.. ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, క్యూ ఆర్ కోడ్ స్కానర్లు వినియోగించాలని పేర్కొన్నప్పటికీ థియేటర్ల ఓపెనింగ్ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ వీడకపోవడం గమనార్హం.

Next Story