కేంద్ర ఎన్నికల సంఘమా .. కల్వకుంట్ల ఎన్నికల సంఘమా?

by  |
కేంద్ర ఎన్నికల సంఘమా .. కల్వకుంట్ల ఎన్నికల సంఘమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పరిణామాలు చాలా విడ్డూరంగా ఉన్నాయని, పోలింగ్ నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘమా లేదా కల్వకుంట్ల ఎన్నికల సంఘమా అంటూ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు పోలింగ్ బూత్‌ల వద్ద టీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తులు కండువాలు కప్పుకొని, గులాబీ టోపీలు పెట్టుకొని, ఇష్టారాజ్యంగా పార్టీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ నిద్రపోతున్నారా అంటూ ఎన్నికల సంఘంపై మండిపడ్డారు.

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోం శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కనీస ఇంగితం లేకుండా వాణీదేవికి ఓటు వేశా అని వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. హోంమంత్రి ఓటును రద్దు చేస్తారా? లేదా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా మహమూద్​అలీపై చర్యలు తీసుకోవాలని దాసోజు డిమాండ్​చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ పంచేందుకు సిద్ధమైందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ దృష్టికి ముందుగానే తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. పోలింగ్​సమయంలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన అధికారులే.. కేసీఆర్‌ను కాపాడుతున్నారని దుయ్యబట్టారు.

Next Story

Most Viewed