మహిళలకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్

by  |
మహిళలకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 42 వేల స్వశక్తి సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివాల్వింగ్​ ఫండ్​ విడుదల చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున ఒక్కో సంఘానికి మొత్తం రూ. 15 వేలు విడుదల చేసింది. ఈ సొమ్మును సంఘాలు తమ నిధిని పెంచుకునేందుకు వినియోగించాలని సూచించారు. సంఘంలోని సభ్యులు దీన్ని కనీస వడ్డీకి అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించాల్సి ఉంటోంది. నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాలకు ప్రోత్సహాకంగా ఈ సొమ్మును ఇచ్చారు.

పంచుకోవద్దు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన రివాల్వింగ్​ ఫండ్​ను సంఘం ఆదాయాభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. అంతకు మినహా సంఘ సభ్యులు ఈ మొత్తాన్ని పంచుకునేందుకు అవకాశం లేదని వెల్లడించారు. దీని నియంత్రణలో భాగంగా మహిళా సంఘాలన్నింటినీ ఆన్​లైన్​ చేసి, రివాల్వింగ్​ ఫండ్​ను వారి ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ రివాల్వింగ్​ ఫండ్​ను సంఘంలోని సభ్యురాలికి అప్పుగా ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటోంది. బ్యాంకు వడ్డీ ప్రకారం తిరిగి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసుకోవాలి. అంతేకానీ ఒకేసారి సంఘ సభ్యులు వాటాలుగా పంచుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలోని కొత్త మహిళా సంఘాలకు రివాల్వింగ్​ ఫండ్​ను విడుదల చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐకేపీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సన్న, సుభాష్​, మహేందర్​రెడ్డితో పాటు మహిళా సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. రాష్ట్రంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లింపుల్లో 98 శాతంతో మన మహిళా సంఘాలు ముందున్నాయని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాకాలు వస్తున్నాయని వారు తెలిపారు. ఈ రివాల్వింగ్​ ఫండ్​తో మహిళలు ఆర్థికాదాయం పెంచుకోవాలని వారు కోరారు.


Next Story

Most Viewed