టీకా పంపిణీపై కేంద్రం కీలక ప్రకటన..

by  |
టీకా పంపిణీపై కేంద్రం కీలక ప్రకటన..
X

న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వయోధికులకు, 45 ఏళ్లు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రెండో దశలో టీకా వేయనున్నట్టు వివరించింది. టీకా పంపిణీ కోసం 10వేల ప్రభుత్వ కేంద్రాలు, 20వేల ప్రైవేటు టీకా పంపిణీ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ కేంద్రాల్లో టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కాగా, ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేసుకోవాలనుకునేవారు అందుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ఎంత మొత్తంలో చెల్లించాలనేది ఇంకా ఖరారు కాలేదని, టీకా తయారీదారులు, పంపిణీదారులతో(హాస్పిటల్స్‌తో) చర్చలు జరుపుతున్నామని అన్నారు.

మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ప్రైవేటు కేంద్రాల్లో టీకాకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. రెండో దశ పంపిణీలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 27 కోట్ల మందికి టీకా వేయాలని భావించిస్తున్నది. తొలుత 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు టీకా వేయాలనుకున్నది. కానీ, తర్వాత వయస్సును 60 ఏళ్లకు పెంచింది. మనదేశంలో 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య 45 నుంచి 50ఏళ్ల వయస్కుల వారి కంటే చాలా తక్కువ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం సీరం అభివృద్ధి చేసిన టీకా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్‌ల పంపిణీకి దేశంలో అనుమతి ఉన్నది. ఈ రెండు టీకాలనే కేంద్రం పంపిణీ చేస్తున్నది. కొవాక్సిన్‌కు బదులు కొవిషీల్డ్ టీకా కోసం పలుచోట్ల డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో దశలోనూ ప్రైవేటు టీకా కేంద్రాల్లో తమకు ఇష్టమున్న టీకాలను లబ్దిదారులు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్నదా? లేదా? అనేది కేంద్రం ఇంకా స్పష్టం చేయలేదు.


Next Story

Most Viewed