ఓబీసీ కులగణనపై తేల్చేసిన కేంద్రం 

by  |
Nithyanand Roy
X

దిశ, ఏపీ బ్యూరో : ఓబీసీ కులగణనపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఓబీసీ కులగణనకు నిరాకరించింది. దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్‌) సరైన సాధనం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి సమాధానంలో తెలిపారు.

ఇకపోతే బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి సర్వే చేపడుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ వెల్లడించారు.


Next Story

Most Viewed