నక్సల్స్ అటాక్‌: మీ త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు

by  |
నక్సల్స్ అటాక్‌: మీ త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు
X

దిశ, వెబ్‌డెస్క్:ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం మధ్యాహ్నం జవాన్లకు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య 22కి చేరుకుంది. ఇంకా చాలామంది అదృశ్యమవ్వగా.. వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న మూడు గంటలపాటు నక్సల్స్, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఐదుగురు మావోలు, ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

కానీ ఇవాళ ఉదయం ఘటనా స్థలానికి అధికారులు వెళ్లి పరిశీలించగా.. 17 మంది జవాన్ల భౌతిక కాయాలు కనిపించాయి. ఇంకా చాలామంది జవాన్లు అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. అయితే మావోల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వీరజవాన్లకు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు.

‘ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు’ అని రాష్ట్రపతి కోవింద్ విచారం వ్యక్తం చేశారు.

‘అమరజవాన్ల ప్రాణత్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ తెలిపారు.

ఇక టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ వీరజవాన్లకు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించాడు. ‘నక్సల్ అటాక్‌లో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని కోల్పోవడం, చాలా మంది గాయాల పాలయ్యారనే వార్తలను వినడానికి హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. ప్రాణాలను అర్పించిన జవాన్లకు దేశం రుణపడి ఉంది. అమరవీరులకు నామన్’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Next Story

Most Viewed