సీసీ కెమెరాకు స్ప్రే కొట్టి.. ఏటీఎంలో చోరీకి యత్నం

by  |
సీసీ కెమెరాకు స్ప్రే కొట్టి.. ఏటీఎంలో చోరీకి యత్నం
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏటీఎం దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు దొంగలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ తలాబ్ కట్టకు చెందిన మహమ్మద్ హైదర్(21), భువనగిరి మండలం జాంపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఆసిఫ్(20)లు స్నేహితులు. డబ్బులు సులభంగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నారు. 2020 డిసెంబరు 31న నరేష్ అనే వ్యక్తి నుంచి కారును అద్దెకు తీసుకున్నారు. ఐరన్ రాడ్, యాష్ కలర్ స్ప్రే బాటిల్‌ను కొనుగోలు చేశారు. వనస్థలిపురం, హయత్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో ఏటీఎంలో డబ్బును దొంగతనం చేయాలని సెర్చ్ చేశారు. కానీ, అక్కడి నుంచి పెద్ద అంబర్ పేట యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లారు. మహ్మద్ హైదర్ రాడ్, స్ప్రే బాటిల్ తీసుకుని ఏటీఎం సెంటర్ లోకి వెళ్లగా.. మహ్మద్ ఆసిఫ్ కారులో ఉండి, బయట వ్యక్యులను గమనిస్తున్నాడు.

ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన హైదర్ తన ఫోటో కన్పించకుండా ఉండేందుకు సీసీ కెమెరాపై స్ప్రే కొట్టాడు. అనంతరం రాడ్‌తో ఏటీఎం మిషన్‌ను బలంగా కొట్టాడు. కానీ, ఆ మిషన్ పగలలేదు. ఈలోగా పోలీస్ పార్టీని చూసిన కారులోని ఆసిఫ్ (ఏ2) ఏటీఎం కేంద్రంలోని హైదర్‌కు సమాచారం ఇవ్వడంతో దొంగతనం చేయకుండానే అక్కడి నుంచి పరారీ అయ్యారు. అనంతరం బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగలను గుర్తించి, అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, టీవీఎస్ ఎక్స్ ఎల్, రాడ్, స్ప్రే బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, క్రైమ్ అడిషనల్ డీసీపీ డి.శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి (ఐటీ సెల్), వెంకటేశ్వర్లు, హయత్ నగర్ డీఐ నవీన్ రెడ్డి లను సీపీ మహేష్ భగవత్ అభినందించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.


Next Story

Most Viewed