వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు

by  |
ys-vivekareddy
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులు, సాక్షుల‌ను విచారిస్తున్నారు. సోమవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త వైఎస్ ప్రకాశ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యపై సీబీఐ అధికారులు అతడిని విచారించారు. వైఎస్ ప్రకాశ్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు అనుమానితులను సైతం సీబీఐ విచారించింది. మరోవైపు నిందితుడు సునీల్ కుమార్ యాద‌వ్‌ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అతడిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పులివెందుల కోర్టులో హాజరుపరచి 10 రోజుల పాటు సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించింది. సోమవారంతో కస్టడీ ముగియడంతో సునీల్‌ను పులివెందులకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

సునీల్ కస్టడీ పొడిగింపు కుదరదు

వివేకా హత్యకేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్‌ను మరికొన్ని రోజులపాటు కస్టడీకి అనుమతివ్వాల్సిందిగా సీబీఐ కోర్టును కోరింది. కస్టడీ పొడిగింపుపై సునీల్ కుమార్ యాదవ్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో రెండురోజులే రిమాండ్ గడువు ఉండటంతో కోర్టు కస్టడీ పొడిగింపు కుదరదని తెలిపింది. మరోవైపు సునీల్‌కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్‌ను పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story

Most Viewed