కరోనాతో ఖాతాల్లోకి డబ్బులు!

by  |
కరోనాతో ఖాతాల్లోకి డబ్బులు!
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో తక్కువ ఆదాయమున్న వాళ్లందరికీ నెలకు రూ.3500/- బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయా? కరోనా వ్యాప్తి భయంతో సోషల్ డిస్టెన్స్ పాటించడంలో భాగంగా వేతనాలు కోల్పోయే వారందరికీ ఊరట లభించనుందా? కరోనా వల్ల దేశంలో డిమాండ్ పడిపోయి ఉద్యోగాలు, జీతాలు కోతకు గురవనున్నందున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) అసంఘటిత వర్గ కార్మికులకు, వీధి వ్యాపారులకు, రోజు కూలీలకు నగదు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇదే సిఫారసు చేసింది.

అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశంలో కరోనా లాంటి వ్యాధినెదుర్కోవడం అంత ఈజీ కాదని, యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు జీతాల కోత విధించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతినుద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నందున యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్ నేతృత్వంలో ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకొనేందుకుగాను ఎకనమిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఐఐ చేసిన నగదు బదిలీ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ద్రవ్యలోటు లక్ష్యాన్ని సవరించి మనీ ప్రింటింగ్‌కు తెర తీయాలని కూడా సీఐఐ సూచించింది. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నందున ఆదాయాలు, ఉద్యోగాలు కోల్పోతున్నవారు తమ బ్యాంకు లోన్లకు ఒకవేళ వడ్డీలు కట్టకపోతే వాటిని ‘ఎన్‌పీఏ’లు‌గా గుర్తించే ప్రక్రియ కూడా వాయిదా వేయాలని కోరింది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ఉద్దీపన పథకాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. ఇప్పటికే కరోనా వల్ల తీవ్రంగా ఎఫెక్టయిన ఇటలీ లాంటి దేశంలో అక్కడి ప్రజలకు ఇన్‌కమ్ సపోర్ట్ ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించారు.

మోడీ 2014 ఎన్నికల హామీ నిలబెట్టుకొనే టైమ్ వచ్చిందని ప్రతిపక్షాలు, మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తాను ప్రధాన మంత్రినైతే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రజల అకౌంట్లలో భారీ మొత్తంగా నగదు వేస్తానని అప్పట్లో మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లడబ్బు తేవడం, దాన్ని అకౌంట్లలో వేయడం రెండిట్లో ఏదీ జరగలేదు. అయితే తాజాగా, కరోనా వ్యాప్తి భయంతో దేశంలో మాంద్యం ఛాయలు నెలకొన్న నేపథ్యంలో కనీసం పేద వర్గాలకైనా ఖాతాల్లో నగదు జమ చేసి.. బీజేపీ, మోడీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

పాలనలో హేతుబద్ధత లేకుండా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకుండా వాటిపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచి పన్ను వసూలు చేసుకోవాలనుకొనే మోడీ ప్రభుత్వ విధానం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజలకు ఆర్థికసాయం అందించాల్సిన సమయంలో వారి జేబు నుంచి మరింత డబ్బును పన్నురూపంలో లాగాలనుకోవడం ఒక్క బీజేపీ ప్రభుత్వానికే చెల్లుతుందని ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్క బ్యారెల్‌ 30 డాలర్ల దిగువకు పడిపోవడం తెలిసిందే.

Tags : corona, social distance, cash transfer, recession

Next Story

Most Viewed