ఒలింపిక్స్ రద్దయ్యితే జపాన్ ఏంటీ పరిస్థితి?

by  |
Olympics
X

దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్‌కు పుట్టినిల్లు గ్రీస్. ఆధునిక ఒలింపిక్స్ ఆ దేశం నుంచే ప్రారంభమయ్యాయి. కాలక్రమంలో ఈ మెగా క్రీడలను పలు దేశాలు నిర్వహిస్తూ వచ్చాయి. ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఆతిథ్య దేశం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త స్టేడియం, ఒలింపిక్ విలేజ్, ఇతర నిర్మాణాల కోసం రూ. వేల కోట్లు వెచ్చించాలి. ఒలింపిక్స్ విజయవంతమై భారీ ఆదాయం వస్తే పర్వాలేదు. కానీ పొరపాటున నష్టాలు వస్తే మాత్రం ఆ దేశం జీడీపీపై ఆ భారం పడుతుంది. దేశం దివాళా తీసే పరిస్థితులు వస్తాయి. 2004లో గ్రీస్‌లో ఒలింపిక్స్ నిర్వహించగా ఆ దేశం 323 బిలియన్ యూరోల నష్టాన్ని మోయాల్సి వచ్చింది. ఒలింపిక్స్ కోసం గ్రీస్ చేసిన అప్పులు ఆ దేశ ఎకానమీ కంటే 181.2 శాతం ఎక్కువ. ఈ ఒక్క దెబ్బకు గ్రీస్ ఇప్పటికీ కోలుకోలేదు. 17 ఏళ్లు గడిచినా గ్రీస్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు. ఇప్పుడు జపాన్‌కు అలాంటి ప్రమాదమే పొంచి ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే ఖర్చు చేశారు. గత ఏడాది ఒలింపిక్స్ వాయిదా పడకుంటే జపాన్‌పై ఎలాంటి ఆర్థిక భారం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

కరోనా దెబ్బకు..

కరోనా దెబ్బకు ఇప్పటికే జపాన్ ఆర్థికంగా భారీ నష్టాన్ని చూస్తోంది. 2021లో మొదటి మూడు నెలల కాలానికి 1.3 శాతం జీడీపీ తగ్గిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఖర్చు ఇప్పటికే అనుకున్న దానికన్నా 22 శాతం పెరిగింది. గత ఏడాది నాటికి టోక్యో ఒలింపిక్స్ బడ్జెట్ 12.6 బిలియన్ డాలర్లుగా ఉండగా.. వాయిదా పడే సరికి అది కాస్తా 15.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక ఏడాది వాయిదా పడినందుకు జపాన్‌పై 2.8 బిలియన్ డాలర్ల వ్యయం అదనంగా అవుతున్నది. కాగా, జపాన్ ప్రభుత్వం చెబుతున్న వ్యయం కంటే రెట్టింపు ఖర్చు ఒలింపిక్స్‌కు పెడుతున్నారని కొన్ని ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. వాస్తవానికి 2013లో టోక్యో ఒలింపిక్స్ బిడ్ గెలిచినప్పుడు 7.5 బిలియన్ డార్లు ఖర్చు అవుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి చెప్పింది. కానీ ఇప్పుడు ఆ వ్యయం రెట్టింపు అయ్యింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ చేసిన అధ్యయనం మేరకు.. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ అన్నింటిలో అత్యంత ఖర్చుతో కూడినది టోక్యో ఒలింపిక్స్ అని తేల్చి చెప్పింది. మరి ఇంత ఖర్చు పెట్టిన జపాన్ ప్రభుత్వం ఆ మేరకు ఆదాయాన్ని తిరిగి సంపాదిస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

రద్దైతే కష్టమే..

కరోనా కారణంగా ఏడాది పాటు ఒలింపిక్స్ వాయదా వేశారు. అయితే గత ఏడాది కంటే ఈసారి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే టోక్యో సహా పలు ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. అంతే కాకుండా ఈ సమయంలో ఒలింపిక్స్ నిర్వహించ వద్దని పలు నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను ఒలింపిక్స్‌కు అనుమతించడం లేదు. దీంతో ఆ మేరకు ఆదాయం కోల్పోయింది. టికెట్ల ద్వారానే కాకుండా టూరిజం ద్వారా రూ. కోట్లాది రూపాయలు ఆదాయం కరోనా వల్ల ఆగిపోయింది. మరోవైపు స్పాన్సర్లు కూడా నెమ్మదిగా తప్పుకుంటున్నారు. కొంత మంది డిస్కౌంట్ ఇస్తే కొనసాగుతామని చెబుతున్నారు. స్వదేశీ ప్రేక్షకులను అనుమతించినా.. కేవలం 50 శాతం మేర మాత్రమే స్టేడియంలను నింపే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి కొంత ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. ఇలా అన్ని వైపుల నుంచి వచ్చే ఆదాయాలు పడిపోవడంతో జపాన్ తప్పకుండా నష్టపోతుందని చర్చజరుగుతుంది. అయితే జపాన్ ఈ నష్టాలను కొంత మేరైనా తగ్గించుకోవాలంటే ఒలింపిక్స్ నిర్వహించడమే మేలని.. అలా కాకుండా పూర్తిగా రద్దు చేస్తే గ్రీస్ లాంటి అర్థిక నష్టాన్ని ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.


Next Story

Most Viewed