రేపు బలపరీక్ష నిర్వహించాలి : సుప్రీం

by  |
రేపు బలపరీక్ష నిర్వహించాలి : సుప్రీం
X

న్యూఢిల్లీ: ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేందుకు ఆదేశించాలని మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రేపు(శుక్రవారం) సాయంత్రం ఐదుగంటల్లోపు కమల్‌నాథ్ సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శాంతియుతంగా.. చేతులు చూపెట్టి ఎమ్మెల్యేలు తమ మద్దతును ప్రకటించాలని సూచించింది. ఈ తతంగాన్ని వీడియో తీయాలని, లైవ్ టెలికాస్ట్ ఉండాలని తెలిపింది.

22 మంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (జ్యోతిరాదిత్య సింధియా వర్గీయులు) రెబల్‌గా మారి బీజేపీ పాలిత కర్ణాటకలోని బెంగళూరుకు తరలిన విషయం తెలిసిందే. దీంతో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. 22 మంది ఎమ్మెల్యేలు(ఆరుగురు మంత్రులు సహా) తమ రాజీనామాలను స్పీకర్‌కు బీజేపీ నేత ద్వారా అందించారు. ఇందులో ఆరుగురు మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదించారు. మిగతా 16 మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వచ్చి రాజీనామా సమర్పిస్తేనే వాటిపై నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ ప్రకటించారు. కాగా, తమ ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని కమల్‌నాథ్ సర్కారు ఆరోపిస్తున్నది. మరోపక్క, తమ ఇష్టానుసారమే ఇక్కడికి వచ్చామని, రాజీనామాలపై ఎవరి ఒత్తిడి లేదని రెబల్ ఎమ్మెల్యేలు వీడియోలు పోస్టు చేస్తున్నారు.

కమల్‌నాథ్ సర్కారు ఈ నెల 16న(బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే) విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ లాల్‌జీ టాండన్.. స్పీకర్ ప్రజాపతిని ఆదేశించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అదే రోజు అసెంబ్లీ సమావేశాలను పదిరోజులు వాయిదా వేస్తున్నట్ట స్పీకర్ ప్రకటించారు. దీనిపై ఆగ్రహించిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేందుకు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తాజాగా, రేపు సాయంత్రం ఐదు గంటల్లోపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాలని ఆదేశించింది. రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలకే కట్టుబడి ఉంటే.. మెజార్టీకి దూరమై కమల్‌నాథ్ సర్కారు కూలిపోక తప్పని పరిస్థితులున్నాయి.

Tags : supreme court, kamal nath govt, floor test, tomorrow



Next Story