BWF ఫైనల్స్ నుంచి భారత పురుషుల జోడి ఔట్

by  |
BWF ఫైనల్స్ నుంచి భారత పురుషుల జోడి ఔట్
X

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్వీక్ సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి బాలీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ 2021 నుంచి వైదొలిగారు. తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఓడిపోయిన ఈ జోడీ రెండో గ్రూప్ మ్యాచ్‌లో మార్కస్ గిద్యోన్-కెవిన్ సుకముల్జోతో తలపడాల్సి ఉన్నది. అయితే సాత్వీక్‌కు మోకాలి గాయం తీవ్రంగా మారడంతో మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలగినట్లు ప్రకటించారు. వరల్డ్ నెంబర్ 11 జోడీ బీడబ్ల్యూఎఫ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన మొదటి భారత బ్యాడ్మింటన్ జోడీగా చరిత్ర సృష్టించింది. కానీ గాయం కారణంగా వైదొలగడం ఫ్యాన్స్‌ను బాధపెట్టింది.

‘సాత్వీగ్ గత రెండు వారాలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అతడికి సరైన విశ్రాంతి లేకపోవడంతో గాయం మానడం లేదు. త్వరలో వరల్డ్ చాంపియన్‌షిప్స్ జరగబోతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని అతడి భాగస్వామి చిరాగ్ శెట్టి అన్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో పీవీ సింధు 21-10, 21-13 తేడాతో వోనీలీ పై గెలిచింది. ఇక కిదాంబి శ్రీకాంత్ 18-21, 7-21 తేడాతో కున్లవుత్‌పై ఓడిపోయాడు. శుక్రవారం అతడు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. అందులో గెలిస్తేగాని నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించే అవకాశం ఉండదు. మహిళల డబుల్స్‌లో భారత జోడీ అశ్విని పొన్నప్ప- సిక్కిరెడ్డి 19-21, 20-22 తేడాతో గాబ్రియేలా స్టోయీవా-స్టెఫానీ స్టోయివా చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ 15-21, 14-21 తేడాతో విక్టర్ అక్సల్‌సేన్ చేతిలో ఓడిపోయాడు.


Next Story

Most Viewed