Eternal: అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీని దాటి విలువైన కంపెనీగా ఎటర్నల్

by S Gopi |

మంగళవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి జొమాటో షేర్ ధర 1.19 శాతం పెరిగి రూ. 327.15 వద్ద ఉంది.

Eternal: అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీని దాటి విలువైన కంపెనీగా ఎటర్నల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ కీలక మైలురాయిని చేరుకుంది. మంగళవారం నాటి ర్యాలీ తర్వాత ఎటర్నల్ మార్కెట్ విలువ దాదాపు రూ. 3.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దిగ్గజ అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా మోటార్స్ లాంటి కంపెనీలను అధిగమించింది. మంగళవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి జొమాటో షేర్ ధర 1.19 శాతం పెరిగి రూ. 327.15 వద్ద ఉంది. గత నెలలో ఎటర్నల్ షేరు ధర 2.75 శాతానికి పైగా, గత మూడు నెలల్లో 31 శాతానికి పైగా పెరిగింది. ఈ నెల ప్రారంభంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నట్టు ప్రకటించింది. రానున్న రోజుల్లో షేర్ ధర రూ. 420కి పెరగవచ్చని విశ్లేషించింది. ఇటీవల జొమాటో ఆదాయం వేగంగా పెరుగుతుండటం, క్విక్-కామర్స్ విభాగం బ్లింక్ఇట్ నుంచి పెరుగుతున్న రెవెన్యూ ద్వారా ఎటర్నల్ కంపెనీపై ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరుగుతోంది. తాజా రూ. 3 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఎటర్నల్ నిఫ్టీ-50లో టాప్-25 జాబితాలో స్థానం దక్కించుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ అదానీ పోర్ట్స్(రూ. 3.03 లక్షల కోట్లు), ఓఎన్‌జీసీ(రూ. 2.96 లక్షల కోట్లు), భారత్ ఎలక్ట్రానిక్స్(రూ. 2.94 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్(రూ. 2.77 లక్షల కోట్లు), విప్రో( రూ. 2.66 లక్షల కోట్లు), టాటా మోటార్స్( రూ. 2.63 లక్షల కోట్లు), కోల్ ఇండియా(రూ. 2.44 లక్షల కోట్ల) కంటే ఎక్కువగా ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశీయ అతిపెద్ద కంపెనీలలో కొన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 19.01 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ. 14.84 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ. 11.06 లక్షల కోట్లు) ఉన్నాయి.

Next Story