స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi నుంచి EV కారు

by Disha Web Desk 17 |
స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi నుంచి EV కారు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Xiaomi కొత్తగా కారును మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్‌లో వస్తుంది. దీనికి సంబంధించిన అనుమతి కోసం కంపెనీ చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ కార్ల రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. Xiaomi కంపెనీ నేరుగా కారును తయారు చేయకుండా బీజింగ్‌కు చెందిన వాహన తయారీ సంస్థ BAIC గ్రూప్‌కు కార్ల తయారీ కాంట్రాక్ట్‌ను ఇచ్చింది.

ఈ కారులో అదిరిపోయే ఫీచర్లను అందించనున్నారు. SU7, SU7 ప్రో, SU7 మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో కారును విడుదల చేసే అవకాశం ఉంది. కారు లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా సరికొత్తగా ఉంటుంది. SU7 ఒక్క చార్జింగ్‌తో గరిష్టంగా 210 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సమాచారం. అదే SU7 మ్యాక్స్ 265 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 5 సీట్లతో వస్తున్న ఈ కారు తయారీని 2023 డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు. 2024 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తారు. స్మార్ట్‌ఫోన్‌లు, వివిధ ఉపకరణాలకు ప్రసిద్ధి చెందిన Xiaomi వాహన రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆటో మార్కెట్‌లో పోటీ మరింత తీవ్రతరం కానుంది.

Next Story