తిరిగి లాభాల బాట పడుతున్న అదానీ కంపెనీల షేర్లు!

by Disha Web Desk 17 |
తిరిగి లాభాల బాట పడుతున్న అదానీ కంపెనీల షేర్లు!
X

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా నెలరోజులకు పైగా నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీల షేర్లు ఎట్టకేలకు తిరిగి ర్యాలీ అవుతున్నాయి. గత వరుస ట్రేడింగ్‌లలో అదానీ కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి. తాజాగా అదానీ సంస్థ కష్టాలను గట్టెక్కేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా, కంపెనీ మరో 800 మిలియన్ డాలర్ల రుణ హామీ పొందినట్టు నివేదికలు వెలువడ్డాయి.

దీనికితోడు ఒడిశాలో కంపెనీ 12.8 కోట్ల టన్నుల బాక్సైట్ బ్లాక్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందిందని ప్రకటించింది. వీటన్నిటికి తోడు అదానీ గ్రూప్ హాంకాంగ్, సింగపూర్‌లలో కంపెనీల భవిష్యత్తు వృద్ధి, బ్యాలెన్స్ షీట్‌లపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచేందుకు రోడ్‌షో నిర్వహించింది. అక్కడ నిధుల సమీకరణ, రుణాల చెల్లింపులపై తమ వ్యూహాన్ని ఇన్వెస్టర్లకు వివరించింది.

ఈ పరిణామాలన్నీ అదానీ కంపెనీల ర్యాలీకి కారణమయ్యాయి. జనవరి చివరి వారంలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీలన్నీ పతనమవుతూ వచ్చాయి. దాంతో సంస్థ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో రూ. 12 లక్షల కోట్ల వరకు క్షీణించింది. గత రెండు సెషన్లలో కంపెనీల షేర్ తిరిగి పుంజుకోవడంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 90 వేల కోట్లకు పైగా పెరిగింది.

ఇక, గ్రూప్ తిరిగి నిలదొక్కుకునే చర్యలు మొదలుపెట్టడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర కేవలం మూడు రోజుల వ్యవధిలో 20 శాతానికి పైగా పెరిగింది. బుధవారం ట్రేడింగ్‌లో సైతం కంపెనీ షేర్ ఏకంగా 14.70 శాతం ర్యాలీ చేసి రూ. 1,564.55 వద్ద ముగిసింది. అదానీ గ్రూపులోని మిగిలిన కంపెనీలు సైతం బుధవారం ట్రేడింగ్‌లో అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్ 5 శాతం పుంజుకున్నాయి. అదానీ పోర్ట్స్ 1.61 శాతం పెరిగింది. తాజాగా ఓ గ్లోబల్ సావరీన్ వెల్త్‌ఫండ్ నుంచి అదానీ గ్రూప్‌నకు 3 బిలియన్ డాలర్ల రుణ సదుపాయం మంజూరు అయినట్లు వచ్చిన వార్తలను సంస్థ నిరాధారమని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed