Uday Kotak: ఇరాన్ యుద్ధ ప్రభావాన్ని భారత్ ఇంకా పూర్తిగా ఎదుర్కోలేదు

by S Gopi |

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం త్వరలోనే మనందరిపై పడుతుంది

Uday Kotak: ఇరాన్ యుద్ధ ప్రభావాన్ని భారత్ ఇంకా పూర్తిగా ఎదుర్కోలేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటివరకు భారత ఆర్థికవ్యవస్థపై పూర్తిస్థాయి ప్రభావం చూపలేదని, అసలు షాక్ ముందుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ హెచ్చరించారు. రానున్న రోజులు కఠినంగా ఉండనున్నాయి. అందుకు సిద్ధమవ్వాలన్నారు. సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్-2026లో మాట్లాడిన ఆయన.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం త్వరలోనే మనందరిపై పడుతుంది, వ్యాపారాలు, మార్కెట్లపై అది స్పష్టంగా కనిపిస్తుంది. గత రెండు నెలలుగా పాత ఇంధన నిల్వల కారణంగా అసలు భారం బయటపడలేదు, కానీ త్వరలోనే ఖరీదైన ఇంధనం నేరుగా వినియోగదారుల జేబులను తాకుతుందని ఆయన స్పష్టం చేశారు.

పెరిగిన చమురు ధరల ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్‌కే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఆహారం నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు దాదాపు ప్రతి ఉత్పత్తి ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పెద్ద దెబ్బ కావచ్చని ఆయన అన్నారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై అనిశ్చితి కొనసాగుతుండటం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై భయాలు పెరగడం వల్ల గ్లోబల్ మార్కెట్లు ఇప్పటికే అస్థిరంగా మారాయి. ఎక్కువ దిగుమతులపై ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం ఉంటుంది. చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిధిలో ఉంటే కరెంట్ అకౌంట్ లోటు అదుపులో ఉండొచ్చు, కానీ అవి 100 డాలర్లపైనే ఉంటే రూపాయి, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం రూపాయి బలహీనత, స్టాక్ మార్కెట్ల నష్టాలు ఈ ఆందోళనలను పెంచుతున్నాయి.

Next Story