Donald Trump: శాంసంగ్‌పైనా టారిఫ్ తప్పదు: ట్రంప్ స్పష్టత

by S Gopi |

ఈ టారిఫ్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అది శామ్‌సంగ్, మరే కంపెనీ అయినా తప్పదు.

Donald Trump: శాంసంగ్‌పైనా టారిఫ్ తప్పదు: ట్రంప్ స్పష్టత
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యాపిల్ కంపెనీ తమ దేశంలోనే తయారీని చేపట్టాలని, దిగుమతి చేసిన వాటి అమ్మకాలపై 25 శాతం పన్ను విధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టారిఫ్ వార్నింగ్ అనేది కేవలం యాపిల్‌కి మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. మరో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని, అమెరికాలో తయారీ చేపట్టకపోతే 25 శాతం దిగుమతి సుంకం కట్టాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అమెరికాలో దిగుమతి చేసి విక్రయించే ఏ మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీకైనా సరే ఈ టారిఫ్ వర్తిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ టారిఫ్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అది శామ్‌సంగ్, మరే కంపెనీ అయినా తప్పదు. అమెరికాలోనే తమ ప్లాంట్‌ను నిర్మించే కంపెనీలకు మాత్రమే ఎటువంటి సుంకం ఉండదని ట్రంప్ తెలిపారు. 'అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలని, ఇక్కడే ప్లాంట్ నిర్మించాలని తాను చాలా కాలం క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు చెప్పాను. అలా కాకపోతే, కనీసం 25 శాతం సుంకాన్ని అమెరికాకు చెల్లించాలి' అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ట్రాంప్ తీరు కారణంగా యాపిల్‌కు భారీ నష్టాలు ఎదురయ్యాయి. తాజాగా 3 శాతం మేర క్షీణించగా, కంపెనీ మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్లు క్షీణించింది. కాగా, యాపిల్ మాదిరిగా శాంసంగ్ చైనా మార్కెట్‌పై ఆధారపడటాన్ని ఎప్పుడో తగ్గించేసింది. 2019లోనే శాంసంగ్ చైనాలో ఉన్న తన ఫోన్ తయారీ ప్లాంటును మూసేసింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కొసం భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

Next Story