Tesla India: భారత్‌లో మొదటి పూర్తిస్థాయి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా

by S Gopi |

ఈ సెంటర్ టెస్లా మరింత నిర్మాణాత్మక రిటైల్ నెట్‌వర్క్ వైపుగా మారేందుకు తొలి అడుగుగా భావిస్తున్నామని కంపెనీ తెలిపింది.

Tesla India: భారత్‌లో మొదటి పూర్తిస్థాయి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా భారత మార్కెట్లో విస్తరణంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి ఫుల్‌స్కేల్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. గురుగ్రామ్‌లో ఆర్కిడ్ బిజినెస్ పార్క్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కంపెనీకి ఉన్న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఢిల్లీలోని ఏరోసిటీల్లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల మాదిరిగా కాకుండా, డిస్‌ప్లే, బ్రాండ్‌ను పరిచయం చేసే స్థలాలుగా కొత్త సెంటర్ ఉంటుంది. బుకింగ్‌లు, టెస్ట్-డ్రైవ్స్ కోసం అనుకూలంగా ఉండనుంది. ఈ సెంటర్ టెస్లా మరింత నిర్మాణాత్మక రిటైల్ నెట్‌వర్క్ వైపుగా మారేందుకు తొలి అడుగుగా భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. గురుగ్రామ్ సెంటర్‌కు ఈ ఏడాది నవంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన శరద్ అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. గతంలో లంబోర్గిని ఇండియా హెడ్, ఆడి ఇండియాలో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన అగర్వాల్‌ను, దేశీయ మార్కెట్లో తన ప్రీమియం ఈవీ ఉనికిని బలోపేతం చేయడానికి టెస్లా నియమించింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా మన మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా, రూ. 59.89 లక్షలు, రూ. 67.89 లక్షల ధరల్లో రెండు మోడల్ వై వేరియంట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్లు పూర్తిగా దిగుమతి చేసుకున్నవే. అయితే, దేశీయ మార్కెట్లో టెస్లా అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) ప్రకారం, టెస్లా సెప్టెంబర్, అక్టోబర్‌లలో 104 యూనిట్లను మాత్రమే విక్రయించింది. టెస్లాకు ప్రస్తుతం స్థానిక తయారీ ప్రణాళికలు లేవు. కొత్త షోరూమ్‌ల ఏర్పాటు, దిగుమతి చేసుకున్న కార్ల అమ్మకాలపైనే దృష్టి సారించనుందని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అంతర్జాతీయంగా టెస్లా కార్లకు అధిక గిరాకీయే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 4.97 లక్షల యూనిట్లను డెలివరీ చేసింది.

Next Story