టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ ప్లాంట్ విస్తరణ.. 35,000 మందికి ఉపాధి

by Dishanational1 |
టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ ప్లాంట్ విస్తరణ.. 35,000 మందికి ఉపాధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించనుంది. తమిళనాడులోని హోసూరు సమీపంలో ఉన్న కూతనపల్లి ఐఫోన్ అసెంబ్లింగ్ హబ్‌ను పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు కంపెనీ తాజా ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా కంపెనీ ప్లాంటులో ఉద్యోగుల సంఖ్యను 175 శాతం పెంచి 55,000కి పెంచుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో 20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. హోసూర్ ప్రాంతంలో కంపెనీ భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. ఇందుకనుగుణంగానే ఆ ప్రాంతంలో రోడ్లు, దుకాణాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్తగా 35 వేల నియామకాలతో ఆ ప్రాంతంలో లక్ష నుంచి లక్షన్నర జనాభా చుట్టుపక్కల పెరుగుతుందని అంచనా. టాటా ఎలక్ట్రానిక్స్ గతేడాది విస్ట్రాన్ ఇండియా ప్లాంటును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్‌లో కంపెనీ సుమారు రూ. 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed