Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ

by S Gopi |

జీఎస్టీ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలు 'యాక్షనబుల్ క్లెయిమ్స్' పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులు జమ చేసే పూర్తి మొత్తంపై 28 శాతం జీఎస్టీ విధించడం రాజ్యాంగబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో డెల్టా కార్ప్ సహా పలు గేమింగ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. జీఎస్టీ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలు 'యాక్షనబుల్ క్లెయిమ్స్' పరిధిలోకి వస్తాయని, అందువల్ల వాటిపై పన్ను విధించవచ్చని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడానికి లేదా నిషేధించడానికి పూర్తి అధికారం ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ తెచ్చిన చట్టాలను రద్దు చేసిన ఆయా హైకోర్టుల తీర్పులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. అంతేకాకుండా, గేమింగ్ కంపెనీలకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా రద్దు చేసింది. అయితే, కంపెనీలకు అందిన షో-కాజ్ నోటీసులపై వివరణ ఇచ్చే హక్కును మాత్రం కోర్టు యథాతథంగా ఉంచింది. ఈ తీర్పుతో ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు భారీ పన్ను భారాన్ని ఎదుర్కోవడమే కాకుండా, రాష్ట్రాల వారీగా కొత్త నియంత్రణలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ తీర్పు ప్రభావం రియల్-మనీ గేమింగ్ రంగంపై భారీగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ జీఎస్టీ డిమాండ్లు దాదాపు రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, అనేక కంపెనీలు ఇప్పుడు భారీ పన్ను భారం, వడ్డీ, జరిమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, అధిక పన్ను విధానం కారణంగా పలువురు ఆపరేటర్లు కార్యకలాపాలను తగ్గించగా, కొందరు ఉద్యోగాల కోతలు కూడా అమలు చేశారు. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో గేమింగ్ రంగంలో వ్యాపారాలు, పెట్టుబడులు, భవిష్యత్ కార్యకలాపాలపై మరింత అనిశ్చితి నెలకొనే అవకాశముందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Next Story