జీ ఎంటర్‌టైన్‌మెంట్ వివాదంలో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు సోనీ

by Dishanational1 |
జీ ఎంటర్‌టైన్‌మెంట్ వివాదంలో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు సోనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: తమకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో కేసును కొనసాగించకుండా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నిలువరించేందుకు సోనీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ)లో దాఖలు చేసిన అత్యవసర మధ్యంతర ఉపశమనాన్ని తిరస్కరించిన నిర్ణయం నిరాశకు గురిచేసిందని సోనీ సోమవారం ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ ట్రెబ్యునల్‌లో సవాలు చేయనున్నట్టు, అక్కడ తమకే విజయం దక్కుతుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు తమకు ఉంది, జీ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి పరిహారాన్ని సైతం ఆశిస్తున్నట్టు సోనీ వెల్లడించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సోనీ గ్రూపునకు చెందిన కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్(గతంలో సోనీ పిక్చర్స్) రూ. 83 వేల కోట్ల విలీన ఒప్పందం చేసుకుంది. ఇటీవల ఈ ఒప్పందాన్ని సోనీ గ్రూప్ రద్దు చేసుకుంది. దీనిపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిస్తూ, సోనీతో ఒప్పందాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో ఒప్పందాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేసిందంటూ సోనీ ఆరోపణలు చేసింది. అందుకు గానూ పరిహారం కింద సుమారు రూ. 750 కోట్లు ఇప్పించాలని సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్ వద్దకు వెళ్లింది. దీనిపై ఆదివారం రోజున ఎస్ఐఏసీ, తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed