ఐపీఓకు వస్తున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ

by Dishanational1 |
ఐపీఓకు వస్తున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఏఐఎల్) త్వరలో ఐపీఓకు రానుంది. దీనికోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి కోసం ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ముసాయిదా పత్రాల ప్రకారం, పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 7,000 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తుండగా, ఇందులో రూ. 5,750 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా, మిగిలిన రూ. 1,250 కోట్లను కొత్త షేర్ల జారీ ద్వారా సేకరించనుంది. మార్కెట్ వర్గాల ప్రకారం, ఇది దశాబ్దంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ఐపీఓ కావడం విశేషం. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా కంపెనీలో అతిపెద్ద వాటా కలిగిన గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ తన 7.235 శాతం వాటా నుంచి షేర్లను విక్రయించనుంది. ఐపీఓ నుంచి వచ్చిన నిధులతో కంపెనీ మూలధన వ్యయం కోసం రూ. 150 కోట్లను, నిర్వహణ వ్యయానికి రూ. 350 కోట్లను, రుణాల చెల్లింపులకు రూ. 500 కోట్లను వినియోగించనున్నట్టు వెల్లడించింది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఆఫ్కాన్స్ కంపెనీ భారీ ఇంజనీరింగ్, నిర్మాణ, ప్రొక్యూర్‌మెంట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 15 దేశాల్లో 76 ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటి కాంట్రాక్ట్ విలువ రూ. 52,200 కోట్లు. ప్రస్తుతం 13 దేశాల్లో 67 ప్రాజెక్టులను చేపడుతోంది. వీటి విలువ రూ. 34,888 కోట్లు.


Next Story

Most Viewed