స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి

by Dishanational1 |
స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ఐపీఓల సందడి కనబడనుంది. మార్కెట్లు ప్రతి రోజూ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో కొత్త కంపెనీలు నిధుల సేకరణకు సరైన సమయంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం రోజుల్లో మొత్తం ఏడు కంపెనీలు తమ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా మరో 8 కంపెనీలు మార్కెట్లలో లిస్టింగ్ కానున్నాయి. ఐపీఓకు వస్తున్న వాటిలో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, అలాగే, కేరళకు చెందిన ఆటోమొబైల్ డీలర్ పాపులర్ వెహికల్ అండ్ సర్వీసెస్, కేపీ గ్రీన్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా సంస్థ ఏవీపీ ఇన్‌ఫ్రాకాన్, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ సంస్థ ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్, సిగ్నోరియా క్రియేషన్, రాయల్ సెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి మొత్తం రూ. 722 కోట్ల మేర నిధులను మార్కెట్ల నుంచి సేకరించనున్నాయి. ఇక, ఈ వారంలోనే మార్కెట్లలో లిస్టింగ్ కానున్న కంపెనీల్లో జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్, స్నాక్స్ తయారీ బ్రాండ్ గోపాల్ స్నాక్స్, ఆర్‌కె స్వామి, ఎస్ఎంఈ సెగ్మెంట్‌లో పూణె ఈ-స్టాక్ బ్రోకింగ్, శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్, కౌరా ఫైన్ డైఅమండ్ జ్యువెలరీ, సోనా మెషినరీ, వీఆర్ ఇన్‌ఫ్రాస్పేస్ కంపెనీలు మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి.


Next Story