రూ. 33 లక్షల కోట్ల సేవల ఎగుమతులు!

by Disha Web Desk 17 |
రూ. 33 లక్షల కోట్ల సేవల ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత సేవల ఎగుమతులు గణనీయంగా వృద్ధి చెందుతాయని సేవల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఈపీసీ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు భారీగా పెరగడంతో, ఈ ఏడాది కూడా అదే ధోరణి ఉంటుందని తద్వారా 2023-24లో సేవల ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల(రూ. 32.88 లక్షల కోట్ల)కు చేరుకుంటాయని ఎస్ఈపీసీ అభిప్రాయపడింది.

2022-23లో దేశ సేవల ఎగుమతులు అంతకుముందు ఏడాది కంటే 42 శాతం పెరిగి 254 బిలియన్ డాలర్ల(రూ. 20.8 లక్షల కోట్ల) నుంచి 322.72 బిలియన్ డాలర్ల(రూ. 26.53 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రాథమిక డేటా చెబుతోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022-23లో సేవల ఎగుమతులు రూ. 25 లక్షల మార్కును చేరుకోవాలని లక్ష్యం నిర్దేశించాం. అయితే, అనుకున్న దానికంటే ఎక్కువగా రూ. 26.50 లక్షల కోట్లను దాటాయి. ఇదే ధోరణి కొనసాగి, నిరంతర వృద్ధి సాధించగలిగితే సేవల ఎగుమతులు 375 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లను చేరుకుంటుందని ఎస్ఈపీసీ చైర్మన్ సునీల్ హెచ్ తలాటీ చెప్పారు.

గత ఆర్థిక సంవత్సరం సేవల రంగం వృద్ధికి ప్రయాణ, రవాణా, వైద్య, ఆతిథ్య రంగాలు దోహదపడ్డాయి. ఐటీ, ఐటీ సంబంధిత సేవల ఎగుమతులు సమర్థవంతంగా ఉన్నాయి. ప్రయాణ రంగంలోనూ పెరుగుదల ఉంది. కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ ద్వారా సేవలకు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయని సునీల్ వెల్లడించారు.

Also Read..

ఉద్యోగులకు షాకివ్వబోతున్నఫేస్ బుక్ మాతృ సంస్థ?

Next Story

Most Viewed