అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో బలహీనపడిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు కీలక బ్యాంకింగ్ రంగ షేర్లలో తిరిగి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు రాణించాయి. సోమవారం వెలువడైన గణాంకాల్లో భారత రిటైల్ ద్రవ్యోల్బణ మూడు నెలల కనిష్టానికి దిగిరావడం, ఇది గ్రామీణ డిమాండ్‌ను పెంచుతుందనే అంచనాల మధ్య మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 482.70 పాయింట్లు లాభపడి 71,555 వద్ద, నిఫ్టీ 127.20 పాయింట్లు ఎగసి 21,743 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం బలహీనపడినప్పటికీ, చాలా వరకు ప్రధాన రంగాలన్నీ 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, టైటాన్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.98 వద్ద ఉంది.


Next Story

Most Viewed