వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లో లాభాలను సాధించాయి. ప్రతికూల ప్రభావం చూపే అంశాలు ఉన్నప్పటికీ సూచీలు నిలదొక్కుకున్నాయి. బుధవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి తక్కువ లాభాలతోనే రోజంతా ర్యాలీ అయ్యాయి.

ముఖ్యంగా చైనాలో కరోనా మళ్లీ పెరుగుతుండటం, ఫెడ్ నిర్ణయాలపై మదుపర్లు అప్రమత్తంగా ఉండటం, దేశీయంగా ఎఫ్అండ్ఓ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో ఒత్తిడి కనబడింది. కానీ, దేశీయంగా ప్రతికూల పరిణామాలు లేకపోవడంతో మెరుగైన లాభాలను చూసిన తర్వాత చివరి గంటలో అమ్మకాలు పెరగడంతో కొంత వరకు లాభాలు తగ్గాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 91.62 పాయింట్లు లాభపడి 61,510 వద్ద, నిఫ్టీ 23.05 పాయింట్లు పెరిగి 18,267 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్ రంగాలు బలహీనపడగా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, డా రెడ్డీ, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.

పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.84 వద్ద ఉంది.


Next Story

Most Viewed