అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయిన సూచీలు

by Dishanational1 |
అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ భారీ నష్టాలు నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో అధిక లాభాలను చూసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను నిర్ణయాన్ని ప్రకటించనుండటం వంటి పరిణామాలు మదుపర్లలో ఆందోళనను పెంచింది. దీనికితోడు కీలక రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లలో అమ్మకాలు జరగడం, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కొన్ని ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ ప్రభావంతో నష్టాలు పెరిగాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో కీలక సెన్సెక్స్ సూచీ 72 వేల మార్కు వద్ద ప్రారంభమైనప్పటికీ, మిడ్-సెషన్ వరకు మాత్రమే లాభాలు కొనసాగాయి. ఆ తర్వాత క్రమంగా అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలు కూడా అదే తరహాలో పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 801.67 పాయింట్లు కుదేలై 71,139 వద్ద, నిఫ్టీ 215.50 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ రంగాలు రాణించగా, మిగిలినవి దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఐటీసీ, ఎల్అండ్‌టీ స్టాక్స్ 2 శాతం కంటే ఎక్కువ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.11 వద్ద ఉంది.

Next Story

Most Viewed