వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రూపాయి బలమైన పునరాగమనం: ఎస్‌బీఐ

by Malleboina Mahesh |

ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో బలంగా పుంజుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో వెల్లడించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రూపాయి బలమైన పునరాగమనం: ఎస్‌బీఐ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 మధ్య) బలంగా పుంజుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం రూపాయి విలువ క్షీణిస్తున్న దశలో ఉన్నప్పటికీ, చారిత్రక ధోరణులు, ప్రస్తుత విశ్లేషణల ప్రకారం ఈ ట్రెండ్ త్వరలోనే మారుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. గతంలో (2007-2014) భారీగా వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఇప్పుడు తగ్గాయని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వాణిజ్య ఒప్పందాలలో జాప్యం రూపాయి విలువపై ప్రధాన ప్రభావాన్ని చూపుతున్నాయని నివేదిక వివరించింది.

ప్రపంచ అనిశ్చితిని తట్టుకుని నిలబడుతున్న దేశీ వాణిజ్యం

2008 నుండి రూపాయి కదలికలను మూడు దశలుగా విశ్లేషించిన ఎస్‌బీఐ, ప్రస్తుతం రూపాయి, డాలర్ రెండూ ఏకకాలంలో క్షీణిస్తున్న మూడవ దశలో ఉన్నాయని తెలిపింది. 2007-2014 మధ్య సగటున 162.8 బిలియన్ డాలర్లుగా ఉన్న పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, 2015-2025 మధ్య 87.7 బిలియన్ డాలర్లకు తగ్గాయని గుర్తుచేసింది. అయినప్పటికీ, పెరిగిన రక్షణ వాదం, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని, దేశీయ వాణిజ్య గణాంకాలు బలంగా ఉన్నాయని నివేదిక కొనియాడింది. ప్రపంచ అనిశ్చితులు తగ్గుముఖం పట్టగానే, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రూపాయి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఎస్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది.

Next Story