Rupee: కొత్త రికార్డు పతనానికి రూపాయి

by S Gopi |

సరఫరా విషయంలో కొత్త ఆందోళనలు పెరగడంతో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు.

Rupee: కొత్త రికార్డు పతనానికి రూపాయి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రూపాయి డాలరుతో మారకంలో మరోసారి చారిత్రాత్మక కనిష్టాల స్థాయికి క్షీణించింది. గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ముఖ్యంగా యూఏఈలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేశాయి. సరఫరా విషయంలో కొత్త ఆందోళనలు పెరగడంతో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం భారత రూపాయి బలహీనపడి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ. 95.25 స్థాయికి చేరుకుని కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. కరెన్సీ ఒత్తిడికి పెరుగుతున్న చమురు ధరలు ప్రధాన కారణంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 110 డాలర్లకు చేరగడం, భారత్ వంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతోంది. అదే సమయంలో, విదేశీ పెట్టుబడులు మన మార్కెట్ల నుంచి నిధుల ఉపసంహరణను కొనసాగించడం, గ్లోబల్ అనిశ్చితి పెరగడం వల్ల రూపాయి మరింత బలహీనపడుతోంది. హోరుమూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల దిగుమతిదారుల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయిపై అదనపు ప్రభావం పడుతోంది. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపైనా కనిపించింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వల్ల సెన్సెక్స్ 251.61 పాయింట్లు నష్టపోయి 77,017 వద్ద, నిఫ్టీ 86.50 పాయింట్ల నష్టంతో 24,032 వద్ద ముగిశాయి.

Next Story