మేలో 10 శాతం పెరిగిన వాహన రిటైల్ అమ్మకాలు!

by Disha Web Desk 6 |
మేలో 10 శాతం పెరిగిన వాహన రిటైల్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మే నెలలో భారత వాహన పరిశ్రమ అన్ని విభాగాల్లో అమ్మకాలు సాధించడంతో గతేడాది కంటే 10 శాతం వృద్ధి నమోదు చేసింది. వాహన డీలర్ల సంఘం ఫాడా తాజా గణాంకాల ప్రకారం, గత నెల పరిశ్రమకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పుంజుకున్నాయని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. టూ-వీలర్(9 శాతం), త్రీ-వీలర్(79 శాతం), ప్యాసింజర్ వాహనాలు(4 శాతం) గణనీయమైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్లు(10 శాతం), కమర్షియల్ వాహనాలు(7 శాతం) అధిక విక్రయాలను నమోదు చేశాయని ఆయన వివరించారు.

కరోనా ముందునాటితో పోలిస్తే స్వల్పంగా(2 శాతం) క్షీణత ఉన్నప్పటికీ, మొత్తం రిటైల్ అమ్మకాలు బాగున్నాయి. అలాగే, కొవిడ్ ముందుతో పోలిస్తే టూ-వీలర్(8 శాతం), కమర్షియల్ విభాగం(7 శాతం) వెనకబడి ఉన్నాయి. ఇక, మేలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) రిటైల్ అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధించాయి. మొత్తం రిటైల్ వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా 8 శాతంగా ఉంది. ఇక, మొత్తం ఈవీల్లో టూ-వీలర్ల వాటా 7 శాతం ఉండగా, త్రీ-వీలర్ విభాగం 56 శాతం వాటాను కలిగి ఉంది. సమీక్షించిన నెలలో పెళ్లిళ్ల సీజన్ ఉన్న కారణంగా టూ-వీలర్ అమ్మకాలు పెరిగాయని ఫాడా తెలిపింది. మరోవైపు ఈ నెల నుంచి ఈవీలకు సబ్సిడీ తగ్గడం కూడా ప్రభావితం చేసింది. ఇక, దేశవ్యాప్తంగా గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు పుంజుకున్నాయని ఫాడా పేర్కొంది.


Next Story

Most Viewed