2జీ,3జీ నెట్‌వర్క్‌లను నిలిపేయాలన్న జియో, వీఐ

by Dishanational1 |
2జీ,3జీ నెట్‌వర్క్‌లను నిలిపేయాలన్న జియో, వీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పాత 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను మూసేయాలని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల అనవసరమైన నెట్‌వర్క్ ఖర్చులను నివారించవచ్చని, వినియోగదారులను కొత్త 4జీ, 5జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుంటుందని చెబుతోంది. అందుకోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని తెలిపింది. జియో బాటలోనే మరో ప్రైవేట్ రంగ టెలికాం వొడాఫోన్ ఐడియా(వీఐ) కూడా 2జీ కస్టమర్లను 4జీ, 5జీకి అప్‌గ్రేడ్ చేసే ప్రయత్నాలు చేయాలని, తద్వారా మరింత మందికి డిజిటల్ సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపింది. 'ప్రభుత్వం 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను నిలిపేయడానికి ఒక విధానం అవసరం. దాంతో 5జీ వినియోగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని' ట్రాయ్ పంపిన కన్సల్టేషన్ పేపర్‌కు స్పందనగా జియో వివరించింది. జియోకి 2జీ నెట్‌వర్క్ లేదు. ఎయిర్‌టెల్, వీఐలు ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్ కింద గణనీయమైన సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాయి. దేశంలోని ఎక్కువమంది పౌరులు పాత టెక్నాలజీ 2జీని ఉపయోగిస్తున్నారు. కనెక్టివిటీ అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త 4జీ, 5జీలను వినియోగించలేకపోతున్నారని వీఐ అభిప్రాయపడింది.


Next Story

Most Viewed