ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లతో మోసగాళ్ల జాబితాను సిద్ధం చేయనున్న ఆర్‌బీఐ!

by Dishanational4 |
ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లతో మోసగాళ్ల జాబితాను సిద్ధం చేయనున్న ఆర్‌బీఐ!
X

ముంబై: బ్యాంకులను, వినియోగదారులను మోసం చేసేవారి కాంటాక్ట్ నంబర్లు, ఐపీ అడ్రస్‌లతో కూడిన 'ఫ్రాడ్ రిజిస్ట్రీ'ని సిద్ధం చేస్తున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ మాట్లాడుతూ, భవిష్యత్తులో బ్యాంకులు, వినియోగదారులను మోసం చేసే వారి జాబితాను సిద్ధం చేస్తున్నాం. దీనిపై పని చేస్తున్నామని, సమాచారాన్ని అందించేందుకు ఏజెన్సీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మోసగాళ్ల గురించిన సమాచారం ద్వారా ఆర్‌బీఐ వారిని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడానికి ఈ రిపోర్టింగ్ మెకానిజం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఐపీ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, లొకేషన్ ఆధారంగా మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుందని భావిస్తున్నాం. అయితే, ఈ ఫ్రాడ్ రిజిస్ట్రీని ప్రారంభించడానికి ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ అంతర్గతంగా సమావేశాలను నిర్వహిస్తోందని, ముఖ్యంగా పర్యవేక్షణ, చెల్లింపులు, సెటిల్‌మెంట్ల విభాగంతో ఈ ప్రక్రియ గురించి చర్చిస్తోందని ఆయన వివరించారు. అధికారిక గణాంకాల ప్రకారం, ఆర్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో 4.18 లక్షల ఫిర్యాదులను అందుకుంది. ఇది 2020-21 కంటే 9.39 శాతం ఎక్కువ. ఇందులో అత్యధికంగా 39 శాతం ఫిర్యాదులు ఏటీఎం/డెబిట్ కార్డులు, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమస్యలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత బ్యాంకు రుణాలు, అడ్వాన్స్‌ల సమస్యలపై 28 శాతం ఫిర్యాదులు ఉన్నాయి.


Next Story

Most Viewed