RBI: మరో రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ

by S Gopi |

ఈ ఏడాదిలో రెండు విడతల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 0.5 శాతం రెపో రేటులో కోత విధించింది.

RBI: మరో రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇప్పటికే రెండుసార్లు కీలక రేట్లలో కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే అక్టోబర్, డిసెంబర్ ఎంపీసీ సమావేశాల్లో ఈ తగ్గింపు ధోరణిని కొనసాగించాలని సెంట్రల్ బ్యాంకు భావిస్తున్నట్టు ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఈ ఏడాదిలో రెండు విడతల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 0.5 శాతం రెపో రేటులో కోత విధించింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనా 4 శాతం కంటే తక్కువగా ఉండవచ్చు. అందుకే వచ్చే మరో రెండు ఎంపీసీ సమావేశాల్లో వడ్డీ రేట్లను తగ్గించే దిశగా వీలుంటుందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఆహార పదార్థాల ధరలు దిగిరావడం కూడా ఇందుకు మద్దతుగా ఉండనున్నాయి. ఇక, బుధవారం అమెరికా ఫెడ్ ప్రకటించే రేట్ల కోత కూడా మన ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేయనుంది. ఈ ఏడాది జరిగిన ఫిబ్రవరి, ఏప్రిల్ ఎంపీసీ సమావేశాల్లో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత జూన్ సమావేశంలో ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో మొత్తంగా 2025లో కీలక రేట్లు 1 శాతం తగ్గాయి. ఆగష్టు నెలలో అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ టారిఫ్ కారణంగా 5.5 శాతం వద్దే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసినట్టు రెండు విడతల్లో కీలక రేట్లను తగ్గించడం వల్ల రెపో రేటు 5 శాతానికి చేరుతుంది. దీనివల్ల బ్యాంకులు రిటైల్ రుణాలపై వడ్డీని తగ్గిస్తాయి.

Next Story